తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయంలో భారత్-చైనా ఒక ఒప్పందానికి వచ్చాయి. త్వరలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ముందు ఇరుదేశాలూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జింపింగ్ హాజరవుతారు.
రష్యాలో జరగబోయే బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని మోదీ పర్యటన గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు వివరించే సందర్భంలో ఈ విషయం తెలియజేసారు. 2020లో తూర్పు లద్దాఖ్లో చైనా సైన్యం చొరబాట్ల కారణంగా తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని ఆయన వివరించారు.
‘‘చైనా ప్రతినిధులతో చర్చలు జరిగాయి. సైనికుల స్థాయిలోనూ, సైనికాధికారుల స్థాయిలోనూ కొంతకాలంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వివిధ ప్రదేశాల వద్ద సమస్యలను పరిష్కరించుకునే ఉద్దేశంతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో సమస్యలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. గత కొన్నివారాలుగా జరుగుతూన్న చర్చల ఫలితంగా భారత చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ ఏర్పాట్ల విషయంలో ఒక అవగాహన కుదిరింది. 2020లో కొన్ని ప్రాంతాల దగ్గర తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభించింది, అక్కడ గస్తీని ఉపసంహరిస్తున్నాము’’ అని చెప్పారు.
బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ ఏయే దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారనే అంశంపై ఇంకా సమాచారం లేదు. అయితే ఈ గస్తీ ఏర్పాట్ల విషయంలో సమస్య పరిష్కారం కారణంగా చైనా అధ్యక్షుడికి, భారత ప్రధానికి మధ్య ముఖాముఖి సమావేశం జరిగే అవకాశముంది.
ప్రధాని మోదీ రేపు, ఎల్లుండి రష్యాలోని కజాన్లో జరిగే బ్రిక్స్ సమావేశాలకు హాజరవుతారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలు. ఈ యేడాది బ్రిక్స్ సమావేశాలకు ‘ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపాక్షిక విధానాన్ని పటుతరం చేయడం’ అన్నదే ప్రధాన ఇతివృత్తం.