ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణల్లో పసలేదని మరోసారి రుజువైంది. గత ఏడాది జరిగిన ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ ఆరోపించిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మాట మార్చారు. ఆరోపణలకు తగిన సాక్ష్యాలు ఏవీ తన దగ్గర లేవన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారం ఆధారంగానే ఆరోపణలు చేసినట్లు చెప్పారు. ‘‘కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య సంస్థల్లో విదేశీ జోక్యం’’ అనే అంశంపై ఒట్టావాలో జరిగిన ప్రభుత్వ విచారణలో ప్రధాని ట్రూడో ఈ విషయాన్ని వెల్లడించారు.
కెనడా ఇంటెలిజెన్స్తో పాటు ‘ఫైవ్ ఐస్’ మిత్రదేశాల ఇంటెలిజెన్స్ కూడా నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని చెప్పాయన్నారు. కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలు ఉమ్మడిగా ‘ఫైవ్ ఐస్ నెట్వర్క్’ నిఘా ఏర్పాటు చేసుకున్నాయి.
ట్రూడో వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి భారత్ ఎంతోకాలంగా చెబుతున్నదే ట్రూడో వ్యాఖ్యలతో రుజువైందని మండిపడింది. దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకు మద్దతిచ్చేలా కెనడా భారత్ కు ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదని పేర్కొంది. భారత్-కెనడా మధ్య సంబంధాలు తీవ్రస్థాయిలో దిగజారడానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరే కారణమని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు.
గత ఏడాది జరిగిన నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.